తిరుపతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతి కోసం త్యాగాలు చేసిన రైతులందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. అమరావతిని కాపాడుకుంటాం.. ఆంధ్రప్రదేశ్ను కాపాడుకుంటామని పేర్కొన్నారు. తిరుపతిలో అమరావతి సంరక్షణ మహోద్యమ సభలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని కోసం అన్ని జాతీయ పార్టీలతో పాటు జనసేన తదితర పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఎన్నికలకు ముందు, అసెంబ్లీ సాక్షిగా జగన్ మోహన్రెడ్డి అమరావతికి మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత మడమ తిప్పను అన్న నేత అమరావతి విషయంలో ఎందుకు మడుమ తిప్పారని ప్రశ్నించారు.
జగన్కు దూరదృష్టి లేదని విమర్శించారు. అమరావతి కోసం 7వందల రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయని, 180మంది ఆందోళనలో చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మందిపై కేసులు నమోదు చేశారు. 5 వందల మందిని వైసీపీ ప్రభుత్వం జైలుకు పంపారని ఆరోపించారు. రైతులు చేస్తున్న ఆందోళనలకు కుల ముద్రవేయడం దారుణమని, ఆందోళనకు మద్దతు తెలుపుతున్న పార్టీలు, సభకు వచ్చిన నాయకులది ఏ కులమో చెప్పాలని జగన్ను నిలదీశారు. అమరావతి రాజధాని నడిబొడ్డున ఉండాలనే ఉద్దేశంతో నిర్మించామని ఏ ఒక్కరి కోసం కాదని , అమరావతి ప్రజా రాజధాని అని పేర్కొన్నారు.
చెడగొట్టకుండా, విధ్వంసం చేయకుండా ఉంటే అమరావతి అభివృద్ధి చెందుతుందని బాబు అన్నారు. ప్రభుత్వానికి చేతకాకపోతే చెప్పండి. .అమరావతిని కాపాడుకుంటాం.. ఆంధ్రప్రదేశ్ను కాపాడుకుంటామని అన్నారు.