అమరావతి : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah )శనివారం ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేయగా అమిత్ షా పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలుపాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదని ట్విటర్లో (Twitter) ఆరోపించారు.
అమిత్ షా పర్యటనను రాష్ట్ర కాంగ్రెస్ ( Congress ) పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని సూచించారు. దేశ ప్రజలకు వెంటనే అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పాలి. తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే దేశ ద్రోహంతో సమానమని అన్నారు.
దేశ ద్రోహుల వ్యాఖ్యలను ఖండించకుండా, క్షమాపణలు చెప్పాలని అడగకుండా, అతిథి మర్యాదలు చేసే వాళ్ళు కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్లేనని ఏపీలో కూటమి నాయకులను విమర్శించారు. రాష్ట్రంలోని దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీ ప్రజల మీద గౌరవం ఉంటే అమిత్ షాతో బహిరంగ క్షమాపణలకు డిమాండ్ చేయాలని కోరారు.