అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరును ఖరారు చేస్తూ ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర తెలిపింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం దాదాపు రెండున్నర గంటల పాటు ఏపీ సచివాలయంలో కొనసాగింది. ఈ సమావేశంలో 42 అంశాలపై చర్చించి వాటికి ఆమోదం తెలిపారు.
ముఖ్యంగా జులై నెలలో అమలు చేసే మూడో విడత అమ్మ ఒడి పథకానికి, జగనన్న విద్యాకానుక, వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వంశదార నిర్వాసితులకు పరిహారం రూ. 216 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని 13 ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
వీరి పదవీ కాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డీసీఎంఎస్ చైర్మన్ల పదవీకాలం ఈనెలఖారు వరకు పూర్తి కానుండడంతో ఆరు నెలల పొడిగింపుతో వీరంతా 2023 జనవరి వరకు కొనసాగనున్నారు.