అమరావతి: సీఎం జగన్, మంత్రి కొడాలని నానిపై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చీప్ ట్రిక్స్ను ఎవరూ నమ్మవద్దని సూచించారు. టీడీపీ మాదిరిగా క్లబ్లు నడిపించే సంస్కృతి వైసీపీకి లేదన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.
ఎక్కడో ఏదో జరిగిందని దానికి ప్రభుత్వానికి, మంత్రికి అంటగట్టి టీడీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. మాగంటి బాబు క్లబ్ నడిపించింది, గురజాలలో యరపతినేని పేకాట ఆడించిన విషయాలు టీడీపీ నేతలు మర్చిపోయినట్లున్నారని దుయ్యబట్టారు. కరోనా వైరస్ అటాక్ అయి మంత్రి కొడాలి నాని దవాఖానలో ఉన్నారని, ఆ మూడు రోజులు ఎవరో డ్యాన్సులు, కోడిపందేలు ఆడిస్తే దానిని మంత్రికి ఆపాదించడం తగదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్బులు మూసివేసిన విషయాన్ని మరిచిపోరాదన్నారు.
విమానాశ్రయాల ఏర్పాటుపై సమీక్ష జరిపిన సీఎం జగన్.. జిల్లాకొకటి చొప్పున ఎయిర్పోర్టు ఉండాలని నిర్ణయించడాన్ని విపక్షాలు రాద్ధాంతం చేయడం తగదని అంబటి రాంబాబు చెప్పారు. గతంలో చంద్రబాబు జిల్లాకొకటి చొప్పున విమానాశ్రయం ఉండాలని చెప్పిన విషయం మరిచిపోయినట్లున్నారన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని, చంద్రబాబు చీప్ ట్రిక్స్ను ఎవరూ నమ్మవద్దని సూచించారు.