అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి, జేఏసీ నాయకులు చేపట్టిన పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. ఇవాళ కృష్ణా జిల్లా గుండుపాలెం నుంచి మహాపాదయాత్ర ప్రారంభమైంది. జేఏసీ నాయకులు శివారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సీఆర్డీఏ చట్టానికి సవరణలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.
ఈ చట్టానికి సవరణలు చేయకుండా యథావిధిగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా సవరణ బిల్లుకు సవరణలు చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై కోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. రైతులు చేపట్టిన అమరావతి నుంచి అరసపల్లి వరకు మహాపాదయాత్రకు వస్తున్న జనాధరణ చూసి ప్రభుత్వం ఓర్వలేక పోతుందని ఆరోపించారు.
టీడీపీ నాయకులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మహా పాదయాత్ర రైతులందరినీ ఐక్యం చేస్తుందని ఆంధ్రుల రాజధాని అమరావతిగా ఉంటుందని తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఏపీ సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.