అమరావతి : బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజును అమరావతి రైతులు నిలదీశారు. అమరావతి రాజధాని విషయంలో బీజేపీ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు తోడు దొంగలని ఘాటుగా వ్యాఖ్యనించారు. అమరావతిలో నిర్వహిస్తున్న పాదయాత్రలో సోమువీర్రాజు, నాయకులు పర్యటిస్తున్న సందర్భంగా స్థానికుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి.
ప్రధాని మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన అనంతరం అప్పటి నుంచి కలలు కంటూనే ఉన్నామని తీరా జగన్ వచ్చిన తరువాత మూడు రాజధానులంటూ ప్రకటన చేసిన తరువాత కేంద్రం ఎందుకు స్పందించలేదని, మూడు రాజధానుల రద్దు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ పాత్ర స్పష్టం చేయాలని నిలదీశారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నామని, కేంద్రం నుంచి కూడా 8500 కోట్ల రూపాయలను అమరావతికి మంజూరు చేసిందని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు ఐదేండ్లలో పూర్తి చేసి ఉంటే జగన్ వచ్చేవాడు కాదని అన్నారు. ఆనాడు బీజేపీని కాదని వెళ్లిపోవడం వల్ల జగన్కు కలిసి వచ్చిందని పేర్కొన్నారు.