అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్ఆర్ఎస్) డిమాండ్ చేసింది. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆర్ఆర్ఎస్ అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు వల్ల రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దులో ఉన్న అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతం ప్రజలు విశాఖకు ఎలా రాగలుగుతారని ప్రశ్నించారు.
రాయలసీమ ప్రాంత ప్రయోజనాల గురించి ఎవరూ ఆలోచించడం లేదని, కేంద్ర ప్రభుత్వం గానీ, న్యాయవ్యవస్థ గానీ ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని సమర్ధించడం లేదని కుంచం వెంకట సుబ్బారెడ్డి చెప్పారు. సాగునీటి రంగం, సమగ్రాభివృద్ధి విషయంలో రాయలసీమ తీవ్ర అన్యాయానికి గురవుతోందని ఆరోపించారు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా వెనుకబడి ఉన్నదని, ఉపాధి కల్పించే పరిశ్రమలు లేవని ఎత్తిచూపారు. కడప ఉక్కు కర్మాగారం ఎండమావిలా తయారైందని విచారం వ్యక్తం చేశారు.
5 రకాల పండ్లను ఎగుమతి చేసేలా అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయవచ్చని ఆర్ఆర్ఎస్ అధ్యక్షుడు సుబ్బారెడ్డి సూచించారు. ఇంతటి అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని మండిపడ్డారు. ఈ ఏడాది అన్ని వర్గాల ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రం చేయాలని లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు.