కృష్ణా జిల్లా : అమరావతి రైతుల మహా పాదయాత్ర ఇవాళ పదవ రోజుకు చేరుకున్నది. అమరావతిని రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తూ.. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ నినదించారు. ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలో పాల్గొన్నారు.
రైతులు పాదయాత్రగా వెళ్తున్న మార్గంలో ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి అమరావతి రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు. విద్యార్థులు భారీ జాతీయజెండాను ప్రదర్శిస్తూ రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. మహా పాదయాత్ర సాగుతున్న మార్గంలో ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి రైతులకు కూల్డ్రింక్స్ అందించారు. స్వామి వారి రథానికి మహిళలు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఇవాళ సాయంత్రానికి మచిలీపట్నం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనున్నది. అనంతరం పెడన, గుడివాడ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతుండగా కృష్ణా జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ స్పీకర్ మండలి బుద్దాప్రసాద్, మండలి రాజా, పెడన టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్తో పాటు వందలాది మంది దివిసీమ రైతులు మహా పాదయాత్రలో ఉన్న అమరావతి రైతులకు ఘనస్వాగతం పలికారు. మహా పాదయాత్ర అమరావతి నుంచి అరసవిల్లి వరకు కొనసాగనున్నది.