తిరుపతి : శ్రీగోవింద రాజ స్వామి(Govindaraja swamy) ఆలయ విమాన గోపురం బంగారు తాపడం( Gold-plating) పనుల్లో 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందని చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవని టీటీడీ(TTD) స్పష్టం చేసింది. హిందూ జన శక్తి సంస్థకు చెందిన లలిత్ కుమార్, ఆదిపట్ల కళాపీఠం అధ్యక్షురాలు కరాటే కల్యాణి తమ ఉనికిని చాటుకోవడానికి అవాస్తవ ఆరోపణలు చేయడాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది.
బంగారు తాపడం పనులు(Gold-plating works) జరుగుతున్న పాత హుజూర్ ఆఫీసు ప్రాంగణంలో 24 గంటలూ సీసీ కెమెరాల(CC Cameras) నిఘా ఉంటుందని వెల్లడించింది. సంబంధిత సిబ్బంది లోనికి వెళ్ళాలన్నా, రిజిస్టర్ లో పేరు నమోదు చేసి, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసేసే వెళ్లాలని తెలిపారు. ఇది నిషిద్ధ ప్రాంతమని పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్, పనిజరిగే ప్రాంతం లో పూర్తి స్థాయిలో అధికారుల నిఘా, విజిలెన్స్ బందోబస్తు కూడా ఉంటుందని వివరించారు.
ఇంతటి పటిష్టమైన ప్రాంతం నుండి 50 కిలోల బంగారం పక్కదారి పట్టించారని ఆరోపించడం వారి అజ్ఞానానికి, ప్రచార యావకు నిదర్శనమని విమర్శించారు. ఆలయ శిల్ప సంప్రదాయం ప్రకారం, జీయర్ స్వాములు,అర్చకుల సలహాలు తీసుకుంటూ స్థపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో బంగారు తాపడం పనులు జరుగుతున్నాయని తెలిపారు. గోల్డ్ మలాం పనులు చేసే కూలీలు విశ్రాంతి తీసుకునే ప్రదేశమని, ఇది గోల్డ్ మలాం పనులు జరిగే ప్రాంతం కాదని పేర్కొన్నారు. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా అవాస్తవ ఆరోపణలు చేసిన సదరు వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.