తిరుపతి : రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై టీడీపీ అధినేత చంద్రబాబు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. ఏపీలో మైనింగ్ మాఫియాకు పాల్పడింది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రిషికొండలో అక్రమాలు జరిగాయని చేస్తున్న చంద్రబాబు ఆరోపణలను ఖండించారు.
కుప్పంలో జరుగుతున్న మాఫియాతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అధికారులే స్వయంగా పర్యవేక్షించి అక్రమ మైనింగ్ జరగడం లేదని తేల్చారని మంత్రి వివరించారు. కుప్పంలో టీడీపీ నాయకులే రౌడీయిజం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలోనే ఇసుకు అక్రమ రవాణా జోరుగా జరిగిందని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజున ఉన్న ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రాన్ని అధిగమించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్ర ఆదాయాన్ని పెంచామని ఆయన పేర్కొన్నారు.