తిరుపతి : మర్మ చికిత్సతో శరీరంలోని అనేక రకాల వ్యాధులను, నొప్పులను దూరం చేయవచ్చని వంశపారంపర్య మర్మ చికిత్స వైద్యులు,బెంగుళూరుకు చెందిన ట్రాన్స్ డిసిప్లినరీ విశ్వవిద్యాలయం అధ్యాపకులు రమేశ్ తెలిపారు. తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో మర్మ చికిత్స విధానాన్నిప్రయోగాత్మకంగా వివరించారు.
“మర్మ చికిత్స – ఏ ఏ వ్యాధులలో ఉపయోగించాలి” అనే అంశంపై ఆయన మాట్లాడారు. శరీరంలో 107 ప్రత్యేక సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయని, వాటిని గుర్తించి వాటిపై తగినంత ఒత్తిడి కలిగించడం ద్వారా అనేక రకాల వ్యాధులను నయం చేయవచ్చని చెప్పారు. వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్న రోగులకు మర్మ చికిత్స ద్వారా తక్షణమే నొప్పి నివారణ అందించవచ్చని వెల్లడించారు.
ఎటువంటి ఔషధం లేకుండా కేవలం ప్రత్యేక స్థానాలపై ఒత్తిడి కలిగించి, వ్యాధులను నివారించే ఈ చికిత్స విధానం ప్రాచీనమైనదని, ఆయుర్వేద, సిద్ద వైద్య గ్రంథాలలో వివరించబడినట్లు చెప్పారు. దేశ విదేశాలలో మర్మ చికిత్స అత్యంత ప్రాచుర్యం పొందిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, అధ్యాపకులు డాక్టర్ రేణు దీక్షిత్, డాక్టర్ శ్రీనివాస్ కుమార్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.