అమరావతి : నెల్లూరు జిల్లా కేంద్రంలో ఇవాళ వైసీపీ నేతలు వేర్వేరుగా తలపెట్టిన సభలపై అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సభల వ్యవహారంపై వైసీపీ అధిష్టానం గుర్రుగా ఉంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కొందరు మాజీ మంత్రి అనిల్కుమార్, తాజా మంత్రి కాకాణితో ఫోన్లో మాట్లాడారు. వివాదాలు లేకుండా కార్యక్రమాలు జరుపుకోవాలని సూచించారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలోని సర్వెపల్లి నియోజక వర్గం నుంచి గెలుపొందిన కాకాణి జనార్ధన్రెడ్డికి ఇటీవల మంత్రివర్గ పునర్వ్యివస్థీకరణలో మంత్రిగా చోటు దక్కింది.
మొన్నటి వరకు ఇదే జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా పనిచేసి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకోలేక పోయారు. తాజా మంత్రి కాకాణి అనుచరులు, అభిమానులు, వైసీపీ నాయకులు సన్మాన కార్యక్రమాన్ని నెల్లూరు పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేశారు. నెల్లూరు పట్టణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అనిల్ మంత్రి కార్యక్రమం కాకుండా కార్యకర్తలతో నెల్లూరులో మరోచోట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం వివాదస్పదంగా మారింది .
ఇందులో భాగంగా ఇరువురు నేతల మధ్య వైరం మరింత ముదురక ముందే సమావేశాలను ప్రశాంతంగా వివాదాలకు తావులేకుండా జరుపుకోవాలని సూచించారు. బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీమంత్రి మీడియాతో మాట్లాడుతూ బహిరంగ సభను కొందరు వివాదంగా మారుస్తున్నారని అన్నారు. ఎవరో కార్యక్రమం పెట్టారని తాను బహిరంగ సభ పెట్టలేదని, బలప్రదర్శన కోసం సమావేశం నిర్వహించడం లేదని కేవలం కార్యకర్తలను కలుసుకునేందుకే బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు.