తిరుమల : టీటీడీ( TTD) అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శనివారం తెల్లవారుజామున తిరుమలలో (Tirumala) విస్తృత తనిఖీలు నిర్వహించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, కృష్ణతేజ సర్కిల్, నారాయణగిరి ఉద్యనవనాల్లోని షెడ్లు(Sheds), క్యూ లైన్ లను(Queue lines) పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులకు అవగాహన కల్పించారు. కంపార్టుమెంట్లలో(Compartments) వడ్డించిన ఉప్మా రుచికరంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందించే విధానాన్ని పరిశీలించి, కంపార్టుమెంట్ల వెలుపల ఉన్న బోర్డులపై భక్తులకు అందించే ఆహార పానీయాలు, సమయాలను పేర్కొనాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కంపార్టుమెంట్లను నిరంతరం పర్యవేక్షించి ఎక్కడా జాప్యం లేకుండా భక్తులను దర్శనానికి వదలాలన్నారు. వీక్యూసీ కంపార్టుమెంట్ల నుంచి భక్తులను దర్శనానికి పంపిన వెంటనే, మరింత మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కృష్ణ తేజ సర్కిల్ వద్ద భక్తులు క్యూ లైన్ ల లోకి ప్రవేశించే మార్గాల వద్ద కొందరు ప్రైవేటు టాక్సీ, జీప్ డ్రైవర్లు అడ్డంగా పార్కింగ్ చేయడాన్ని గమనించి, డ్రైవర్లను హెచ్చరించారు. భవిష్యత్తులోఅనధికారిక పార్కింగ్ నివారించేందుకు, స్థానిక పోలీసులతో చర్చలు జరపాలని టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. అదనపు ఈవో వెంట ఏఈవోలు గంగాధరం, మునిరత్నం, అధికారులు ఉన్నారు.