అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా ఈనెల 7 నుంచి 18 వరకు 6900 బస్సులను నడుపుతున్నామని ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పండుగకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు వివరాలను వెల్లడించారు. ప్రత్యేక సర్వీసులకు 50 శాతం టికెట్ ధర పెంచుతున్నామని , రోజుకు సరాసరిగా 470 బస్సులు నడుపుతామని వివరించారు. 9 వేల సర్వీసు నెంబర్ ఉన్న బస్సులను ప్రత్యేక సర్వీసులుగా అవసరాలకు అనుగుణంగా నడుపుతామని తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు స్వస్థలాలకు రానున్న దృష్ట్యా ప్రయాణికులు కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆయన ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సుగా మార్చే ప్రణాళిక ఉందని, ఎలక్ట్రిక్ బస్సు ట్రయల్ రన్ను ఫిబ్రవరిలో నిర్వహిస్తున్నామని ప్రకటించారు. తిరుమలకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని కోరుతున్నారని ఎండీ స్పష్టం చేశారు.