హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తనతో భేటీ అయిన అంశం రచ్చ కావడంతో సినీ నటుడు మోహన్బాబు స్పందించారు. మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహం సమయంలో కలిసినప్పుడు ఇంటికి రావాల్సింది ఆహ్వానించడంతోనే పేర్ని నాని తన ఇంటికి వచ్చాడని మోహన్బాబు స్పష్టం చేశారు. పేర్ని నానితో భేటీపై వస్తున్న విమర్శలను ఖండించారు.
ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు ఇద్దరూ తనకు బంధువులే అని మోహన్బాబు చెప్పారు. వీరిద్దరి కోసం గతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి ఇద్దర్నీ ఎలా వదులుకుంటానని ప్రశ్నించారు. కాగా, క్రియాశీల రాజకీయాల్లోకి మళ్లీ వచ్చే ఉద్దేశమేదీ తనకు లేదన్నారు. సినిమాలు, విద్యాసంస్థ అభివృద్ధి మినహా మరో ఆలోచన లేదని స్పష్టం చేశారు.
తాను ప్రధాన పాత్రలో నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రం ఈ నెల 18 న విడుదల చేస్తున్నట్లు మోహన్బాబు తెలిపారు. అదేవిధంగా తిరుపతిలోని తన విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్మించిన షిరిడీ సాయినాథుడి ఆలయాన్ని ఏప్రిల్ లేదా మే నెలలో ప్రారంభించేలా పనులు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.