కాకినాడ జిల్లా: యాసిడ్ లోడ్తో వెళ్తున్న లారీ దూసుకురావడంతో హోంగార్డు మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. బెండపూడి ఆర్టీఏ చెక్పోస్టు వద్ద శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ సంఘటన జరిగింది. ట్యాంకర్ అదుపు తప్పడం వల్లనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బెండపూడి ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద యాసిడ్ ట్యాంకర్ ఒకటి వేగంగా దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో చూసేంతలోనే అక్కడ నిలిపి ఉంచిన లారీని గుద్దేసింది. అలాగే రోడ్డుపై ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోవిందరాజులు అనే హోంగార్డు తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గాయపడిన మరో వ్యక్తి చికిత్స పొందుతూ దవాఖానలో చనిపోయినట్లు సమాచారం. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వాహనంపై ట్యాంకర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రమాదానికి గురైన యాసిడ్ లారీ విశాకపట్నం నుంచి రాజమండ్రికి వెళ్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ఇలాఉండగా, కృష్ణా జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. బాపులపాడు మండలం అంపాపురంలో వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ను ఢీకొని బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితులు అత్తిలిలో ఓ వివాహానికి హాజరై హైదరాబాద్కు వెళ్తున్నట్లు తెలుస్తున్నది.