అమరావతి : అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులకు పరిహారం చెల్లించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని కర్మాగారాల్లో భద్రత లోపాలు తరుచూ బయటపడుతుండటం ఆందోళనకర పరిణామమని ఆయన అన్నారు. దేశ ప్రగతికి పరిశ్రమల ఆవశ్యకత ఎంతో అవసరమని అయితే ప్రజల ఆరోగ్యం, ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యతనూ విస్మరించరాదని పేర్కొన్నారు.
అచ్యుతాపురం సెజ్లో సీడ్స్ కంపెనీలో నెలరోజుల్లో రెండుసార్లు విషవాయువుల లీకేజీ ఘటనలు ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. దువ్వాడ, అచ్యుతాపురం, పరవాడ తదితర పారిశ్రామిక ప్రాంతాల చుట్టుపక్కల కాలనీవాసులు ప్రమాదాల మధ్య కాలం వెల్లదీస్తున్నారని అన్నారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని సూచించారు. గ్యాస్ లీకేజీలో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారినికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
,