తిరుపతి జిల్లా: లంచం తీసుకుంటూ సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సందర్భంగా ఆయన వద్ద అక్రమంగా ఉన్న దాదాపు రూ.2 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడుల విషయం తెలియగానే కిటికిలో నుంచి నగదును బయటకు విసిరేశారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆ నగదును స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టారు.
సూళ్లూరుపేటలో భవన నిర్మాణాల అనుమతుల విభాగంలో అనేక అక్రమాలు జరుగుతున్నట్లు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని ఏసీబీ అధికారులు మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ కార్యాలయంపై దాడులకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే, ఏసీబీ దాడులకు వస్తున్న విషయం లీక్ కావడంతో ఆయన తన టేబుల్ సొరుగులో దాచుకున్న నగదును కిటికిలో నుంచి బయటకు విసిరేశారు. నగదు విసిరిన విషయాన్ని గుర్తించిన అధికారులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ఆయన కార్యాలయంలో సోదాలు జరిపారు. అలాగే టౌన్ ప్లానింగ్ సెక్షన్లో కూడా తనిఖీలు చేపట్టారు.
మరోవైపు నరసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో కూడా ఏసీబీ సోదాలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్పై ఫిర్యాదులు అందడంతో ఈ తనిఖీలను ఏసీబీ జరిపింది. ఎంత మేర అవినీతి జరిగిందో తేల్చే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు. ఏసీబీ ఏఎస్పీ వెంకట్రావు, డీఎస్పీ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.