అమరావతి : ఏపీలోని పలు శాఖలకు చెందిన అధికారుల నివాసాలు, వారి కార్యాలయాలపై గురువారం ఏసీబీ అధికారులు(ACB Raids) ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలతో తనిఖీలు నిర్వహించిన అధికారులు వారి వద్ద నుంచి నగదును, బంగారం, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవాలయం(Durga Temple) సూపరింటెండెంట్గా పనిచేస్తున్న వాసా నగేశ్ ఆస్తులపై సోదాలు నిర్వహించారు. విజయవాడ కమ్మురిపాలెంలోని లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్లోని నగేశ్ నివాసంతో పాటు అతడికి సంబంధించిన ఆరుచోట్ల సోదాలు చేశారు. గతంలో ఆ అధికారి పనిచేసిన భీమడోలు, ద్వారకా తిరుమల, నిడదవోలుతో పాటు దుర్గా దేవాలయంలోని ఏఓ కార్యాలయం, అతడి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. ద్వారకా తిరుమలలోని నగేశ్ అపార్ట్మెంట్లల్లో కీలక రికార్డులను స్వాధీనం(Records Seize) చేసుకున్నారు.
కర్నూలు అసిస్టెంట్ రిజిస్ట్రార్(Assistant Registrar)సుజాతకు సంబంధించిన ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆమెకు సంబంధించి కర్నూలులో 5 ఇళ్లు, సుంకేసుల గ్రామంలో 2.50 ఎకరాల వ్యవసాయ భూమి, శివారు ప్రాంతంలో ఎనిమిది ఇళ్లస్థలాలు, 40 తులాల బంగారం, కారు , రూ. 8.21లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar ) రాఘవరావు ఇళ్లపై దాడులు చేశారు. అతడి భార్య భార్యపేరుతో రామవరపాడు వద్ద జిప్లస్ డూప్లెక్స్ ఇళ్లు, గుండల, విజయవాడ, ఆవనిగడ్డలో కుమారుల పేర్లతో ఐదు ప్లాట్లు, ఖరీదైన కార్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ అధికార వద్ద 1580 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 12.71లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఫిర్యాదులు రావడంతోనే అధికారుల ఇళ్లపై దాడులు చేశామని ఏసీబీ అధికారులు(ACB Officers) వెల్లడించారు.