హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జైలులో ఏసీ పెట్టేందుకు ప్రిజన్ రూల్స్ ఒప్పుకోవని పేర్కొంటూనే ప్రత్యేక కేసుగా పరిగణించి కోర్టు ఆదేశిస్తే అప్పుడు పరిశీలిస్తామని జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ చెప్పారు. దీంతో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో శనివారం సాయంత్రం హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వాదనలు వినిపించారు. ఈ నెల 12న జీజీహెచ్ సూపరింటెండెంట్ నుంచి వచ్చిన ప్రభుత్వ వైద్యబృందం చంద్రబాబు శరీర భాగాల్లో పలుచోట్ల స్కిన్ అలర్జీ, దద్దుర్లు ఉన్నట్టు గుర్తించామని జైలు అధికారులకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నదని, ఆయన బ్యారక్లో చల్లటి వాతావరణం ఉండేలా చూడడంతోపాటు పలు రకాల మందులను వైద్యులు సిఫార్సు చేశారని కోర్టులో చెప్పారు. వాదనలు విన్న అనంతరం ఏసీబీ కోర్టు స్పందిస్తూ వైద్యుల సూచనలకు అనుగుణంగా చంద్రబాబు బ్యారక్లో చల్లదనం ఉండేలా టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.