అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అవినీతి విభాగాలను ప్రక్షాళన చేయాల్సిందేనని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇవాళ క్యాంపు కార్యాలయంలో హోంశాఖ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఉంటే విభాగాలను క్లీన్ చేయాల్సిందేనని సూచించారు. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీ యాప్ను రూపొందించాలని ఆదేశించారు.
మండల స్థాయి వరకు ఏసీబీ స్టేషన్లు విస్తరించాలని, ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపై ఏసీబీ పర్యవేక్షిస్తుందన్నారు. విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘాను కొనసాగించాలని సూచించారు. ఎస్ఈబీకి ప్రత్యేక కాల్ సెంటర్ ఉండాలని పేర్కొన్నారు. అవినీతి, దిశ, ఎస్ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తామని వివరించారు. రాష్ట్రంలో డ్రగ్స్కు చోటు ఉండొద్దని అధికారులకు తెలిపారు. నేర నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగం బలోపేతం చేయాలన్నారు.