అమరావతి : కాబోయే భర్తతో ఆనందంగా గడపాల్సింది పోయి.. కళ్లకు గంతలు కట్టి కత్తితో దాడి చేసింది. ఈ దారుణ ఘటన విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో సోమవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వీ మాడుగుల మండలం ఘాట్రోడ్డుకు చెందిన అద్దెపల్లి రాము నాయుడు(28), రావికమతానికి చెందిన వియ్యపు పుష్ప(22)కు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్లోని సీఎస్ఐఆర్లో రాము నాయుడు పీహెచ్డీ చేస్తున్నాడు. అయితే మూడు రోజుల క్రితమే రాము స్వగ్రామానికి చేరుకున్నాడు.
ఇద్దరం కలిసి కేక్ కట్ చేద్దామని చెప్పి రాముకు పుష్ప ఫోన్ చేసింది. దీంతో రాము జ్యోతిర్మయి బాబా దివ్యక్షేత్రానికి సమీపంలోని గుట్ట వద్దకు చేరుకున్నాడు. పుష్ప కూడా తన స్కూటీపై అక్కడికి చేరుకుంది. ఇద్దరు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. నీకో సర్ప్రైజ్ ఇస్తాను.. కళ్లు మూసుకోమని రాముకు ఆమె చెప్పింది. ఈ క్రమంలో చున్నీతో రాము కళ్లకు గంతలు కట్టింది. ఇక తన వెంట తెచ్చుకున్న కత్తితో రాము మెడపై దాడి చేసి గాయపరిచింది. దీంతో అతను కిందపడిపోయాడు. నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని పుష్ప రోదిస్తూనే.. తీవ్ర రక్తస్రావమైన రాముని తన స్కూటీపైనే రావికమతం పీహెచ్సీకి తీసుకెళ్లింది. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాము ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తల్లిదండ్రులతో వాదించానని పోలీసులకు పుష్ప తెలిపింది. తన మాట వినకుండా రాముతో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారని ఆమె వాపోయింది. దిక్కుతోచని స్థితిలోనే రాముపై కత్తితో దాడి చేశానని పుష్ప పోలీసులకు చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.