అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఐ నాయకుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రం చేస్తున్న అప్పులు మాత్రమే కనిపిస్తున్నాయని ఎక్కడా కూడా అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని ఆరోపించారు. రాష్ట ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అంతా బాగుందని ఏపీ ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి, పోలవరం ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.
మరో నాయకుడు నారాయణ మాట్లాడుతూ దేశాధ్యక్ష స్థానాన్ని ఓటు బ్యాంకు కోసం వాడుకోవడం సరికాదని అన్నారు. గిరిజన చట్టాలను సవరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని, దీనిని ద్రౌపదీ ముర్ము అంగీకరిస్తారా అని ప్రశ్నించారు.