అమరావతి : ఏపీలోని విశాఖపట్నంలో తహసీల్దార్రమణయ్య (Tahsildar Ramanaiah) హత్య కేసులో పోలీసులు ముందడుగు వేశారు. ఈ మేరకు నిందితుడిని గుర్తించామని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్(CP Ravi Shanker Ayyannnar) మీడియాకు వెల్లడించారు. కేసును దర్యాప్తు చేసేందుకు, నిందితుడిని పట్టుకునేందుకు ఇద్దరు ఏసీపీలను నియమించామని పేర్కొన్నారు. నిందితుడు ఎయిర్పోర్టు (Airport) వైపు వెళ్లినట్లు గుర్తించామని, బహుశా విమానం కూడా ఎక్కినట్లు తెలిసిందని వివరించారు.
నిందితుడి కోసం అన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నామని సీపీ తెలిపారు. త్వరలో నిందితుడని పట్టుకుంటామని, రియల్ ఎస్టేట్ ( Real estate), భూవివాదాలే హత్యకు కారణం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన ఇంట్లోనే దుండగులు చంపేశారు. చినగదిలి రూరల్ తహసీల్దార్గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బంటుపల్లికి బదిలీ అయ్యారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ఆయన కొమ్మాదిలోని తన ఇంటికి చేరుకున్నారు.
రాత్రి 10.15 గంటల సమయంలో ఫోన్ రావడంతో కిందకు వచ్చి అపార్ట్మెంట్ గేట్ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్లో నమోదైంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దుండగుడు తనతో తెచ్చుకున్న ఇనుపరాడ్తో రమణయ్య తలపై దాడిచేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆయన మృతి చెందారు.