హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తేతెలంగాణ) : వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని, కేసు విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని కోరుతూ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ ప్రారంభం కాగానే పిటిషన్ ఏపీకి చెందినదని జగన్ తరఫు న్యాయవాది బెంచ్కు చెప్పారు. మారిన పరిస్థితుల్లో కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. స్పందించిన జస్టిస్ సంజయ్కుమార్ ‘నాట్ బిఫోర్ మీ’ అనడంతో పిటిషన్లు మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. జస్టిస్ అభయ్ ఏఎస్ ఓకా నేతృత్వం వహించే ధర్మాసనం ముందుకు పంపాలని రిజిస్ట్రీకి సూచించారు.