అమరావతి : వైఎస్సార్ కడప జిల్లా జిల్లా బద్వేలులో ఘోరం జరిగింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కొడుకును ప్రియుడితో కలిసి తల్లి దారుణంగా హత్య చేసిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బద్వేలు పట్టణంలోని రూపారాం పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కవిత అనే వివాహిత రెండు వారాల క్రితం నాలుగేండ్ల కొడుకును వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి హత్య చేసింది. కొడుకు కనిపించకపోవడంతో నిలదీసిన తండ్రికి ఆమె ఏదో ఒకటి బుకాయిస్తూ వచ్చింది. చివరకు పోలీసులకు భర్త ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కవిత ఆమె ప్రియుడు వినోద్ను పోలీసులు తమదైన శైలీలో విచారించగా హత్య చేసి ఇంటికి సమీపంలో పాతిపెట్టినట్లు అంగీకరించారు.
దీంతో శుక్రవారం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి తహసీల్దార్ సమక్షంలో పంచాయతీ సిబ్బందితో గోయి తవ్విచూడగా బాలుడి మృతదేహం లభ్యమైంది.మృతదేహానికి పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించారు. కాగా ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై దాడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.