కర్నూల్ : తన స్నేహితుడు పెన్సిల్ దొంగిలించాడంటూ ఓ పిల్లాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తాను హోంవర్క్ చేసుకుంటుంటే మరో బాలుడు తన పెన్సిల్ ఎత్తుకెళ్లాడని ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని పెద కడుబూరు పరిధిలో చోటు చేసుకుంది. హన్మంత్ అనే విద్యార్థి పెన్సిల్ను మరో అబ్బాయి దొంగిలించాడు. దీంతో హన్మంత్ స్థానిక పోలీసు స్టేషన్కు వెళ్లి పెన్సిల్ దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రతి రోజు పెన్సిల్స్ దొంగతనం చేస్తున్నాడు. పైసలు కూడా తీసుకుపోతున్నాడు. రోజు ఇదే పని అని హన్మంత్ పోలీసులకు చెప్పాడు. ఈ ఒక్కసారి కేసు పెట్టండి అని కోరాడు.
సార్ పెన్సిల్ తిరిగి ఇచ్చాను అని మరో అబ్బాయి సంజాయిషీ ఇచ్చుకున్నా.. హన్మంత్ మాత్రం వినలేదు. ఇదొక్కసారి కేసు పెట్టండి సార్ అని పోలీసులను అడిగాడు హన్మంత్. ఇద్దరు పిల్లలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి స్టేషన్ నుంచి పంపించేశారు. హన్మంత్ తీరుతో పోలీసులు సరదాగా నవ్వుకున్నారు. ఇద్దరూ బాగా చదువుకోవాలని పోలీసులు సూచించారు.