అమరావతి : ఓ నాలుగేండ్ల చిన్నారి ఆడుకుంటూ తప్పిపోయింది. అదృశ్యమైన ఆ పసిపాప దట్టమైన అడవిలో 40 గంటల పాటు ఉండిపోయింది. పోలీసుల విస్తృత తనిఖీల తర్వాత బాలిక ఆచూకీ లభ్యమైంది. దీంతో అటు పోలీసులు, ఇటు పాప తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని నక్కలగుట్ట గ్రామానికి చెందిన ఓ ఉద్యోగి కూతురు శనివారం పిల్లలతో ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. పిల్లలతో ఆడుకుంటుండగా ఆ పాప అదృశ్యమైంది. జోషిక ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు గ్రామమంతా వెతికారు. శనివారం రాత్రంతా వెతికినా పాప దొరక్కపోవడంతో.. ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాప ఆచూకీ కోసం చర్యలు చేపట్టారు. గ్రామస్తుల సాయంతో సమీప అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఆ ఏరియాల్లో ఉన్న బావులను పరిశీలించారు. ఎక్కడా కూడా జోషిక కనిపించలేదు. స్నిఫర్ డాగ్ సహాయంతో కూడా వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఆదివారం మొత్తం గాలించారు. ఇక సోమవారం మధ్యాహ్నం పోలీసులు దట్టమైన అడవిలోకి వెళ్లారు. ఆ సమయంలో పాప ఏడుపులను ఓ పోలీసు బృందం గమనించింది. చెట్ల పొదల దగ్గర చిన్నారిని పోలీసులు గుర్తించారు. స్వల్ప గాయాలతో జోషిక కనిపించింది. దీంతో ఆమెను కుప్పం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
దాదాపు 40 గంటల పాటు పోలీసులు విరామం లేకుండా పాప ఆచూకీ కోసం శ్రమించారు. అయితే పాప కోలుకున్న తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు పోలీసులు. జోషికను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ఆడుకుంటూ ఆమెనే అడవిలోకి వెళ్లిందా? అన్న విషయాలు తెలిసే అవకాశం ఉందన్నారు.
పాప ఆచూకీ లభించిన అడవి ఏనుగులకు, ఇతర వన్య మృగాలకు ఆవాసమని పోలీసులు తెలిపారు. ఈ అడవిని కంగుండి రిజర్వ్ ఫారెస్ట్గా పిలుస్తారు. అంబపురానికి దగ్గర్లో ఉందన్నారు. ఈ రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయరు. ఎందుకంటే ఏనుగుల భయం ఉంటుంది. కానీ పాప అంత దట్టమైన అడవిలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పాపకు ఏనుగులు ఎలాంటి హానీ తలపెట్టకపోవడంతో పోలీసులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.