Srisailam | శ్రీశైలంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత దేవస్థాన పరిపాలనా భవన ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆలయ సంప్రదాయకనుగుణంగా మహాగణపతి పూజ చేశారు. అటుపై జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పుష్పమాల సమర్పించారు. దేవస్థానంలోని స్పెషల్ ప్రొటెక్షన్ పోర్స్ సిబ్బంది పతాక వందనం చేశారు. తర్వాత దేవస్థానం ఈఓ ఎస్ లవన్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అటుపై జాతీయ గీతాన్ని ఆలాపించారు.
శ్రీశైలం దేవస్థానంలో శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన, క్షేత్రాభివ్రుద్ధి అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు ఈఓ ఎస్ లవన్న తెలిపారు. ఒకవైపు దేవస్థానాన్ని అభివ్రుద్ధి చేయడంతోపాటు మరోవైపు శ్రీశైల మహా క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం- దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్, దేవాదాయ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు చక్రపాణిరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు దేవస్థానం అభివ్రుద్ధికి మార్గదర్శకత్వం వహిస్తూ , ప్రోత్సహిస్తూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. అందుకు దేవస్థానం తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.
ధర్మకర్తల మండలి సభ్యులు ఓ మధుసూధన్ రెడ్డి కూడా మాట్లాడారు. పతాకావిష్కరణ తర్వాత శ్రీ సాయి లలిత, నెల్లూరు- కూచిపూడి న్రుత్య నికేతన్ ఆధ్వర్యంలో దేశభక్తి గేయానికి సంప్రదాయ న్రుత్యం ప్రదర్శించారు. దేవస్థాన పారిశుద్ధ్య సిబ్బందికి దేవస్థానం తరఫున యూనిఫామ్ డ్రస్ అందజేశారు.