అమరావతి: ఉక్రెయిన్ నుంచి మరో 160 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. భారతీయ పౌరుల తరలింపులో ఏడో రోజు నాడు తెలంగాణకు చెందిన 94 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 66 మంది విద్యార్థులు ఢిల్లీ, ముంబైలలో అడుగుపెట్టారు. ఆయా ప్రాంతాల నుంచి వీరిని తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉక్రెయిన్ పొరుగు దేశాలైన బుకారెస్ట్ (రొమేనియా), బుడాపెస్ట్ (హంగేరి), ర్జెస్జో (పోలాండ్), కోసీస్ (స్లోవేకియా), సుసెవా (రొమేనియా) నుంచి 16 విమానాల్లో విద్యార్థులను తరలించారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన 66 మంది విద్యార్థులు రావడంతో రాష్ట్రానికి చెందిన వారి సంఖ్య 270 కి చేరుకున్నది. ఢిల్లీ, ముంబైకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి గమ్యస్థానాలకు విమానాలను అనుసంధానం చేసి టిక్కెట్లు సిద్ధం చేశారు. తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల్లో విద్యార్థులను స్వాగతించి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇదిలాఉండగా, స్థానిక తెలుగు అసోసియేషన్ వాలంటీర్లు, ఎంబసీ కోఆర్డినేటర్లు, ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన కొందరు తెలుగు విద్యార్థులను కలిశారని బుడాపెస్ట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎన్నారై వ్యవహారాల సలహాదారు వెంకట్ మేడపాటి తెలిపారు. గత రెండు రోజులుగా సహాయ కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయన్నారు. రేపటి నుంచి రోజుకు కేవలం 2 విమానాలు మాత్రమే వస్తాయని, సరిహద్దు వద్ద సంఖ్యలో పెరుగుదల కారణంగా అక్కడి భారతీయ రాయబార కార్యాలయం మరిన్ని విమానాలను ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 80 మంది విద్యార్థులు శనివారం వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.