అమరావతి : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య ఓ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమై 50 ఏళ్లు గడిచాయి. ఐదు దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చిన ఘనత ఈ రైలుకు దక్కింది. ఆ రైలు పేరే గోదావరి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (Godavari Super Fast Express-12727 / 12728 ) . ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నం(Visakapatnam) , రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad ) మధ్య గోదావరి ఎక్స్ప్రెస్ రాకపోకలు సాగిస్తు వస్తుంది .
ఈ సందర్భంగా గురువారం విశాఖ రైల్వే అధికారులు, సిబ్బంది విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రైలుకు పూలదండలు వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. 1974 ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఎక్స్ప్రెస్ రైలు 14 బోగీలతో ప్రారంభం కాగా నేడు నూతన సాంకేతికతతో 24 బోగీలతో నడుపుతున్నారు.
ప్రతిరోజు సాయంత్రం హైదరాబాద్, విశాఖపట్నం నుంచి బయలు దేరే గోదావరి ఎక్స్ప్రెస్ రైలు 770 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకుంటుంది . కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, అనకాపల్లి మీదుగా విశాఖపట్నానికి, అదే దారిలో గోదావరి హైదరాబాద్కు చేరుకుంటుంది .