Tirumala | తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు టీటీడీ ప్రగాఢ సానుభూతి తెలిపింది. తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. తిరుపతిలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అన్నారు.
తొక్కిసలాటలో మృతిచెందిన ఆరుగురి కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం అందజేయాలని టీటీడీ తీర్మానించిందని బీఆర్ నాయుడు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు భక్తులకు రూ 5 లక్షలు పరిహారం, స్వల్పంగా గాయపడ్డ 31 మంది భక్తులకు రూ 2 లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే చెక్కులు సిద్ధం చేశామని చెప్పారు. రేపు బాధితుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేస్తామని పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగమిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మృతుల కుటుంబాల్లోని పిల్లల విద్య ఖర్చులు టీటీడీనే భరిస్తుందని తెలిపారు.
తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు న్యాయ విచారణకు ఆదేశించారని బీఆర్ నాయుడు తెలిపారు. తప్పిదం ఎలా జరిగిందనే దానిపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. కావాలనే చేశారా అనే అంశంపై విచారణ చేయిస్తామని చెప్పారు. విచారణ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఇలాంటి తొక్కిసలాట ఘటనలు మున్ముందు జరగకుండా చూస్తామని చెప్పారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.