అమరావతి: ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం కారణంగా విద్యార్థులు సురక్షితంగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు చెందిన 21 మంది విద్యార్థులు ఢిల్లీ , బెంగళూరు మీదుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వైద్యవిద్య అభ్యాసం కోసం రాష్ట్ర విద్యార్థులు ఉక్రెయిన్లోని జపోరిజయాలో నివాసముంటున్నారు.
యుద్ధం కారణంగా అక్కడ ఉన్న విద్యార్థులను, తెలుగు ప్రజలను స్వదేశాలకు పంపిస్తుండడంతో భారతీయ పౌరుల తరలింపులో నిన్న ఏడో రోజు తెలంగాణకు చెందిన 94 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 66 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు.
ఈరోజు మరో 21 మంది రావడంతో రాష్ట్రానికి చెందిన వారి సంఖ్య 291 కి చేరుకున్నది. వచ్చిన విద్యార్థులను తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల్లో స్వాగతించి వారి స్వస్థలాలకు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేశారు.