Srisailam | శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పరమ శివునికి ప్రీతికరమైన రుద్రాక్ష సేవ చేసేందుకు 30 అడుగుల పంచముఖి రుద్రాక్ష సహిత మహా శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించినట్లు కామ్య రుద్రాక్ష ఆధ్యాత్మిక సేవ సమితి వ్యవస్థాపకులు పగడాల మల్లికార్జున రావు తెలిపారు. ఈ సందర్భంగా 20 లక్షల రుద్రాక్షలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం మహాలింగానికి షోడశోపచార పూజ క్రతువులు నిర్వహించి శివ భక్తులకు దర్శనం కల్పించడంతో పాటు రుద్రాక్ష ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పగడాల మల్లికార్జున రావు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోనే తొలిసారి రుద్రాక్షలతో 30 అడుగుల శివలింగాన్ని ఏర్పాటు చేయడంతో యాత్రికులు ఆనంద పరవశులవుతున్నట్లు తెలిపారు. సాక్షాత్తు పరమశివుని కన్నీటి బిందువుల నుంచి ఉద్భవించిన ప్రకృతి ప్రసాదమైన రుద్రాక్షలను తీసుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి నిలువెత్తు మహా రుద్రాక్ష శివలింగాన్ని దర్శించుకున్నారని.. నేపాల్ ప్రాంతం నుంచి వచ్చిన పంచ ముఖి రుద్రాక్షలను ప్రసాదంగా స్వీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శ్రీశైల మహా క్షేత్ర గ్రామ దేవత అంకాలమ్మ ఆలయం వద్ద ఇటువంటి మహత్కార్యానికి సహాయ సహకారాలు అందించిన స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, ఈఈ రామకృష్ణ, మురళీధర్, ఏఈవో హరిదాసు, మోహన్తోపాటు ఆలయ ప్రధాన విభాగ అధికారులు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రుద్రాక్ష సేవ మూడు రోజులపాటు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.