అనంతపురం : అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో అమానుషం చోటు చేసుకుంది. రెండు నెలల పసిపాపను కన్న తండ్రే కడతేర్చాడు. పాప తన పోలికలతో పుట్టలేదంటూ ఆ చిన్నారిని తండ్రి మల్లికార్జున చంపేసి చెరువులో పడేశాడు.
వివరాల్లోకి వెళ్తే కల్యాణదుర్గంకు చెందిన మల్లికార్జున భార్య రెండు నెలల క్రితం డెలివరీ అయింది. పుట్టిన బిడ్డకు తన పోలికలు రాలేదని మల్లికార్జున భార్యతో గొడవపడ్డాడు. గత రెండు నెలల నుంచి ఈ విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇంటి నుంచి నిన్న పాపను తండ్రి మల్లికార్జున బయటకు తీసుకెళ్లాడు. ఎంతకీ మల్లికార్జున ఇంటికి తిరిగి రాకపోవడంతో.. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
తండ్రి, పాప కోసం నిన్నటి నుంచి పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న చెరువులో పాప శవమై తేలింది. దీంతో పోలీసులు చెరువు నుంచి పాప మృతదేహాన్ని బయటకు తీశారు. ఇదే సమయంలో మల్లికార్జున్ పోలీసులకు ఫోన్ చేసి పాపను తానే చంపినట్లు అంగీకరించాడు. అనంతరం బెంగళూరు వెళ్లానని పోలీసులకు తెలిపాడు. చిన్నారి తల్లితో పాటు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.