హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్ను టాటా సుమో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది వలస కూలీలు దుర్మరణం చెందగా.. తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఆంధ్రప్రదేశ్లోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
మృతుల్లో 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు చిక్బళ్లాపూర్ పోలీసు అధికారి నాగేశ్ తెలిపారు. దసరా పండుగకు కూలీలంతా సొంతూళ్లకు వెళ్లారు. తిరిగి ఉపాధి కోసం బెంగళూరులోని హోంగసంద్ర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పొగమంచు ఉండటంతో డ్రైవర్ నరసింహులు.. ఆగి ఉన్న ట్యాంకర్ గమనించకుండా ఢీ కొట్టాడు. దీంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న 14 మందిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, 8 మంది చిక్బళ్లాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.