అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 13,460 కరోనా పరీక్షలు నిర్వహించగా 122 మందికి పాజిటివ్గా తేలింది. వరుసగా రెండో రోజు కూడా రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
ఇదే సమయంలో మరో 236 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,176 మంది కరోనా బారిన పడగా.. వారిలో 23,01,904 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 1,543 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,729గా ఉన్నది. రాష్ట్రంలో నేటివరకు 3,31,39,649 కరోనా టెస్టులు చేశారు. క్రితం రోజు 101 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. పశ్చిమ గోదావరి జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 18, అనంతపురం జిల్లాలో 16, తూర్పు గోదావరి జిల్లాలో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.