తిరుమల : తిరుమలలో శ్రీవారి దర్శనంతో వందలాది మంది అనాథలు(Orphans), అంధులు, దివ్యాంగులు పులకించిపోయారు. చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి చొరవతో రాజస్థాన్ యూత్ (Rajastan) అసోసియేషన్, చెన్నై(Chennai) ఫుడ్ బ్యాంకు ఆధ్వర్యంలో 1008 మంది అనాథలు, అంధులు, దివ్యాంగులు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాధం, వీజీవో బాలిరెడ్డి కలిసి వృద్ధులు, దివ్యాంగుల క్యూలైన్ ద్వారా వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీవారిని దర్శించుకున్న వారిలో 160 మంది అంధులు, 100 మంది దివ్యాంగులు, 108 మంది వృద్ధులు, 50 మంది మానసిక వికలాంగులు, అనాథలు కలిపి మొత్తం 1,008 మంది ఉన్నారు. వీరిలో ఐదేళ్ల చిన్నారుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది మొదటిసారి శ్రీవారిని దర్శించుకున్న వారే కావడం విశేషం.
శ్రీవారి దర్శనం(Darsan)తో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమ మనోనేత్రంతో స్వామివారిని దర్శించుకున్నామని పలువురు అంధులు సంతోషం వ్యక్తం చేశారు. స్వామి వారి దర్శనం కల్పించినందుకు నిర్వాహకులకు, టీటీడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. దర్శనానంతరం అనాథలు, అంధులు, దివ్యాంగులు తరిగొండ వెంగమాంబ కాంప్లెక్స్ లో అన్నప్రసాదాలు స్వీకరించారు.