తిరుమల : తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు శ్రీఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం అమ్మవారికి ఆస్థానం నిర్వహిస్తారు. ఆగస్టు 8న ఆలయంలో శ్రీచక్రత్తాళ్వార్ సాత్తుమొర, శ్రీప్రతివాది భయంకర అన్నన్ సాత్తుమొర జరుగనున్నాయి. ఆగస్టు 11న అమ్మవారి శాత్తుమొర సందర్భంగా ఉదయం శ్రీగోవిందరాజ స్వామి, ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. కరోనా కారణంగా అలిపిరి పాదాల మండపం వద్ద ఉత్సవమూర్తుల ఊరేగింపును టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా ఆలయంలోనే ఉభయదారులు ఉభయం సమర్పిస్తారు.