అమరావతి : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. సోమవారం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక వార్డుల్లో ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఘర్షణ పడ్డారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పనులు చెప్పక తప్పలేదు. కుప్పంలోని విజయవాణి కళాశాల వద్ద స్థానికేతరులను అరెస్టు చేయాలని టీడీపీ శ్రేణులు నిరసన తెలుపడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేయడంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులును అరెస్టు చేయడంతో పోలీసులను టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిలదీశారు. కుప్పం 16వ వార్డులో దొంగ ఓటర్లను పోలీసులకు అప్పగించగా వారిని వదిలేశారని ఆరోపించారు.
కమలాపురంలో వైఎస్సార్సీపీ దొంగ ఓట్లు వేయిస్తోందని స్థానికులు ఆందోళనకు దిగారు. కాకినాడ 9 వ డివిజన్లో, విశాఖలో బీజేపీ, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్లో అక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలోని పోలింగ్ కేంద్రాన్ని, వెబ్ కాస్టింగ్ను కలెక్టర్ చక్రధర్బాబు పరిశీలించారు. 35వ డివిజన్లో కలెక్టర్ చక్రధర్బాబు ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతపురం పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికకు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించిన ఎంపీ గోరంట్ల మాధవ్ను మాజీ ఎమ్మెల్యే పార్థసారధి అడ్డుకునే యత్నం చేయగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది పోలీసులు వారిద్దరిని సముదాయించి అక్కడి నుంచి పంపించివేయడంతో వివాదం సద్దుమణిగింది. నెల్లూరులోని పలు ప్రాంతాల్లో ఉదయం వర్షం పడడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు.