తొలకరి మొదలైంది. తడి వాతావరణంలో పాడిపశుల్లో వివిధ రోగాలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో సోకే గొంతువాపు వ్యాధి.. పశువులకు ప్రాణాంతకంగా మారుతుంది.
తొలకరి జల్లులు పడే సమయాల్లో పశువుల్లో ‘గొంతువాపు’ ఎక్కువగా సోకుతుంది. దీనినే గురకవ్యాధి, గుండె వాపు అని కూడా పిలుస్తారు. మన రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా బర్రెలకు ఎక్కువగా సోకుతుంది. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధికారక సూక్ష్మజీవి పశువుల శ్వాసకోశంలో నివసిస్తూ, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న పశువులపై దాడి చేస్తుంది. గొంతుకింద నీరు దిగి గొంతు వాస్తుంది.
లక్షణాలు :వ్యాధికి గురైన పశువు శరీర ఉష్ణోగ్రత 104-106 డిగ్రీలకు చేరుతుంది. ముక్కుల మీద తేమ ఆరిపోతుంది. గొంతు కింద నీరుదిగి, గొంతు వాపు వస్తుంది. తల, కళ్లు కూడా వాస్తాయి. కష్టంగా శ్వాస పీలుస్తూ, గురక పెడుతుంది. నోటి నుంచి చొంగ, కళ్ల నుంచి నీరు కారుతుంది. ఎప్పుడు చూసినా మగతగా, ఆలసటగా కనిపిస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే పశువు 24 గంటల్లోనే చనిపోతుంది.
నివారణ :వర్షాకాలానికి ముందే (జూన్, జూలై మాసాల్లో) పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. దీనివల్ల 6-12 నెలల పాటు ఈ వ్యాధి సోకకుండా ఉంటుంది. పశువుల పాకలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. వ్యాధి సోకిన పశువుల్ని మంద నుంచి వేరుచేయాలి. మరణించిన పశువు కళేబరాన్ని, అది తినగా మిగిలిన గడ్డిని లోతైన గొయ్యితీసి పాతిపెట్టాలి.