శాశ్వత పందిళ్లలో తీగజాతి కూరగాయలు సాగు చేయడం మంచిదని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ జగదీశ్వర్ తెలిపారు. కూరగాయల్లో ప్రధానంగా అధిక పోషకాలు, డిమాండ్ ఉన్న కాకర, బీర, సొర, దొండ, చిక్కుడు, బీన్స్, నేతి బీరకాయ తదితర తీగజాతి పంటలను సాధారణ పద్ధతిలో పండించే కన్నా పందిరి, శాశ్వత పందిరి ద్వారా సాగు చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కూరగాయల సాగుకు అనువైన ఎర్ర, ఇసుక, నల్ల రేగడి నేలలు, అనుకూలమైన వాతావరణం ఉన్నదని చెప్పారు. తగు జాగ్రత్తలు తీసుకుంటే, శాశ్వత పందిరి సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. కొందరు రైతులు ఇప్పటికీ మూస పద్ధతిలో తీగజాతి కూరగాయలను నేల మీద పాకించడం వల్ల చీడపీడలు ఎక్కువగా ఆశిస్తున్నాయనీ, ఫలితంగా ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడంలేదని తెలిపారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన శాశ్వత పందిళ్ల ద్వారా తీగజాతి కూరగాయలు పండిస్తే, నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చని చెప్పారు. శాశ్వత పందిరి ఏర్పాటు కోసం ఉద్యాన శాఖ రాయితీ అందిస్తున్నదని ఆయన తెలిపారు. ఇందుకోసం దగ్గరలోని ఉద్యాన అధికారిని, కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
శాశ్వత పందిరితో
ఎకరం విస్తీర్ణంలో పందిరి నిర్మాణానికి 10 అడుగుల పొడవు, 6.8 అంగుళాల మందం కలిగిన రాతిస్తంభాలు లేదా సిమెంటు దిమ్మెలు 220 (14×14) అవసరం అవుతాయి. అదే వరుసల మధ్య 18 అడుగులు, స్తంభాల మధ్య 14 అడుగులు ఎడం ఉంచినట్లయితే 188 సిమెంటు దిమ్మెలు అవసరం అవుతాయి. అదే విధంగా 8 గేజ్ జింక్ పూత కలిగిన జి.ఐ.తీగ 600 కిలోలు, 10 గేజ్ జి.ఐ.తీగ 900 కిలోలు అవసరం అవుతుంది. ముందుగా నిర్ణయించుకున్న దూరంలో (14’x14’ లేదా 18’x14) రెండు అడుగుల గుంతలు తీసుకొని, తీగను జాగ్రత్తగా స్తంభాల మధ్య అల్లుకొన్నట్లయితే శాశ్వత పందిరి తయారవుతుంది.
–టి.మాసయ్య