రాష్ట్రంలో వానకాలం, యాసంగి కాలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న సుగంధ ద్రవ్య పంట.. మిరప. కూర మిరపతోపాటు ఎండు మిరప కోసం కూడా సాగు చేస్తున్నారు. మిగతా పంటలతో పోలిస్తే ఈ పంటను ఎక్కువ మొత్తంలో పురుగులు, తెగుళ్లు ఆశించి నష్టపరుస్తున్నాయి. రైతులు వీటి నివారణకు రసాయన మందులు వాడుతున్నారు. ఫలితంగా రసాయన పురుగు మందుల అవశేషాలు ఉండి, మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నది. ఇటీవల అందుబాటులోకి వచ్చి న సేంద్రియ సాగు విధానాలు రసాయన పురుగు మందు అవశేషాలు లేని మిరప ఉత్పత్తులకు బాటలు వేస్తున్నాయి. ముఖ్యంగా మిరప పంటను తొలిదశలో అంటే నర్సరీ దశ నుంచి ఆశించి నష్టపరిచే వైరస్ తెగుళ్ల నివారణకు వృక్షాల నుంచి సేకరించిన హెర్బల్ పురుగు మందులు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అటు పర్యావరణానికి హాని కలిగించకుండా, ఇటు రసాయన అవశేషాలు లేని ఉత్పత్తులను అందించడంలో అద్భుతంగా సహకరిస్తున్నాయి.
ఆకు ముడత
మిరపలో ప్రధానంగా మూడు వైరస్ తెగుళ్ల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నది. ఈ ఆకు ముడత జెమిని వైరస్ ఆశించడం వల్ల వస్తుంది. ఈ వైరస్ ఆశించిన మొక్కల ఆకులు చిన్నవిగా మారుతాయి. పైకి ముడుచుకుని పడవ ఆకారంలో ఉంటాయి. ఆకు ఈనెలు ఆకుపచ్చగాను, ఈనెల మధ్య లేత ఆకుపచ్చగా లేదా పసుపు పచ్చరంగు కలిగి ఉంటాయి. కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది.
మొవ్వకుళ్లు తెగులు
దీనినే పీ నట్ బడ్ నెక్రోసిస్ వైరస్ అంటారు. ఈ వైరస్ ఆశించిన మొక్కల చివర్లు ఎండిపోతాయి. కాండంపై నల్ల ని నిర్దిష్ట ఆకారంలేని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. ఆకులపై వలయాలుగా నెక్రోటిక్ మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
కుకుంబర్ మొజాయిక్ వైరస్
ఈ వైరస్ ఆశించిన మిరప మొక్కలు గిడసబారి ఎదుగుదల లోపిస్తుంది. ఆకులు పత్రహరితం కోల్పోతాయి. ఆకారం మారిపోయి కొనలు సాగి, మొజాయిక్ లక్షణాలు కనిపిస్తాయి. పూత, కాత ఉండదు. ఈ వైరస్ పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది.
వ్యాప్తి
సాధారణంగా వైరస్ తెగులు నీటి ఎద్దడి ఉన్నప్పుడు, పొడి వాతావరణంలో ఎక్కువగా ఆశిస్తాయి. నత్రజని ఎరువులు ఎక్కువగా వాడటం, కలుపు మొక్కలు ఎక్కువగా ఉండి వైరస్లకు ఆశ్రయాలుగా ఉంటాయి. దీంతో వీటి ఉధృతి పెరుగుతుంది.
నివారణ
సేంద్రియ సాగులో రసాయన పురుగు మందుల అవశేషాలు లేకుండా ఉండేందుకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి.
1. వేప గింజల కషాయాన్ని 5 శాతం చొప్పున వాడవచ్చు. వేపనూనెను పిచికారీ చేయవచ్చు. సేంద్రియ ఎరువులు వాడాలి.
2. గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలను పొలంలో ఉంచితే తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. వైరస్ సోకిన మొక్కలను గుర్తించి పీకి పారేయ్యాలి.
3. గట్లమీద వైరస్కు స్థావరాలైన కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. పొలం చుట్టూ 2,3 వరుసలలో సజ్జ, జొన్న, మక్కజొన్నలను రక్షణ పంటలుగా వేసుకోవాలి.
హెర్బల్ పురుగు మందులు
మొక్కల నుంచి మాత్రమే సేకరించి అన్ని వైరస్లను సమర్థవంతంగా నివారణ చేయగలిగే హెర్బల్ పురుగు మందులు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. రసాయన పురుగు మందుల కంటే సమర్థవంతంగా పనిచేస్తూ, తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఇవి వాడిన ఉత్పత్తులకు మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులుగా ప్రిమియం ధర ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది.