తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నది. రైతులకు మేలుచేసే సంకల్పంతో.. సరికొత్త పథకాలు, మేలైన సాగు విధానాలతో ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ పరిశోధన కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నది. అందుకు అనుగుణంగా.. పెద్దపల్లి జిల్లా కూనారం పరిశోధన కేంద్రం సరికొత్త ఆవిష్కరణలకు అడ్డాగా నిలుస్తున్నది. ఇక్కడ సృష్టించిన సరికొత్త వంగడాలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తున్నది.
కూనారం పరిశోధన కేంద్రం 2007లో ప్రారంభమైంది. ఇక్కడ 250 రకాలకు పైగా బ్రీడింగ్ లైన్స్పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక్కడినుంచి వచ్చిన కేన్ఎం-733, కేఎన్ఎం(కూనారం సన్నాలు)-118, కేఎన్ఎం-1638 రకాలు స్టేట్ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా కూనారం-2పేరుతో గతేడాది ఆగస్టులో ఆమోదం పొందాయి. ఈ మూడు రకాలు సాగు చేయడానికి తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల్లోని రైతులు ఆసక్తి చూపుతున్నారు. కేఎన్ఎం-1638 రకాన్ని కూడా విస్తృతంగా సాగు చేస్తున్నారు.
తెలంగాణలోని సాగు నేలల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చీడపీడలు, తెగుళ్లను తట్టుకొని ఎకువ దిగుబడిని ఇచ్చే కొత్త వరి వంగడాల రూపకల్పనే కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ సుమారుగా 250కి పైగా రకాలు, 800కు పైగా బ్రీడింగ్ రకాలపై దిగుబడి, చీడపీడలు తెగుళ్లను తట్టుకునే సామర్థ్యంపై పరీక్షలు నిర్వహిస్తున్నాం. అనేక ప్రయోగాలు, పరిశోధనల ఫలితంగా నాణ్యమైన దిగుబడులను అందించే వంగడాలను రూపొందించాం.
డా. సిద్ధి శ్రీధర్, శాస్త్రవేత్త, కూనారం పరిశోధన కేంద్రం.
కేఎన్ఎం-1638 విత్తనాన్ని రెండేళ్ల క్రితమే నిజామాబాద్ జిల్లాలో తొలిసారిగా పరిచయం చేశాం. ఈ విత్తన రకం విశిష్టతలను తెలిపి, పండించి చూడమని డా. శ్రీధర్ సిద్ధి చెప్పారు. ఆయన ఏటా మాకు బ్రీడర్ విత్తనాలను ఇస్తారు. తెలంగాణవాసుల ఆహార అలవాట్లకు అనుగుణంగా కేఎన్ఎం-1638 సన్నరకం ఉంటుంది. వ్యాపారుల మన్ననలు కూడా పొందుతున్నది. మెరుగైన రకాలు ఎకడైనా నిలదొకుకుంటాయి అనడానికి కేఎన్ఎం-1638 రకమే నిదర్శనం. రైతుకు మేలైన రకం.
ఆర్. నర్సారెడ్డి, వాడి గ్రామం, ధర్పల్లి మండలం
-అంకరి ప్రకాశ్