Rabit farming | ప్రస్తుతకాలంలో జంతుజీవాల పోషణ ప్రధానాకర్షణగా మారిపోయింది. పాడి పశువులు, గొర్రెలు, కోళ్ల పెంపకంతో పాటు కుందేళ్ల పెంపకంపై కూడా ఆసక్తి పెరుగుతున్నది. మేకలు, కోళ్లకు ఉన్నంత మార్కెట్ లేకపోయినా ఔత్సాహకులు మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుని ఈ కుందేళ్లను పెంచేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. కుందేలు మాంసంలో కొవ్వు చాలా తక్కువగా ఉండి ప్రోటీన్లు లభిస్తాయి. గుండె జబ్బుతో బాధపడేవారు దీనిని తీసుకోవడం చాలా మంచిది. తెలుగు రాష్ట్రాల్లో కుందేలు మాంసంపై పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ.. గోవా వంటి ప్రాంతాల్లో కుందేలు మాంసానికి మంచి డిమాండ్ ఉన్నది.
స్థలం ఉన్నవారు ప్రత్యేకంగా గుడిశెలను నిర్మించి కుందేళ్లను పెంచవచ్చు. అలా కుదరకపోతే బోన్లలోనూ వాటిని పెంచవచ్చు. వ్యర్థ కూరగాయ ముక్కలు, గింజలు, ఇతర ఆహారాలు, ఆకులను తిని ఇవి జీవిస్తాయి. వేసవి, వానాకాలం, చలికాలాలను తట్టుకునేలా బోన్లు, పాకలను నిర్మిస్తే.. కుందేళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే వాటికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించాలి. కుందేళ్లకు సమయానికి ఆహారం ఇవ్వడం ద్వారా ఆరోగ్యంగా పెరిగే వీలుంటుంది. సాధారణంగా వీటికి బలం కోసం తృణ ధాన్యాలు, చిక్కుడు గింజలు, పశువులకు వేసే పచ్చి గడ్డి, క్యారెట్, క్యాబేజీ ఆకులు వంటివి ఇవ్వచ్చు. ఫలితంగా తక్కువ పెట్టుబడితో బోలెడు లాభాలను అందిస్తాయి.
రకాలు
1. ఉన్ని కోసం పెంచే అంగోరా జాతివి
2. మాంసం కోసం పెంచే బ్రాయిలర్ జాతివి అందుబాటులో ఉంటాయి.
పునరుత్పత్తి
బాయిలర్ కుందేళ్ల పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. 3 నెలల వయస్సులోనే 2 కిలోల బరువు పెరుగుతాయి. ఆడ కుందేళ్లు 5 – 6 నెలల వయస్సు వచ్చే సరికి సంతానాత్పోత్తికి సిద్ధంగా ఉంటాయి. మగ కుందేళ్లను మాత్రం ఏడాది వయస్సు వచ్చాకే సంతానోత్పత్తికి వినియోగించాలి. కుందేళ్లు 5 – 6 నెలల కాలవ్యవధిలో పిల్లలకు జన్మనిస్తాయి. తర్వాత 6 వారాలకు అవి మళ్లీ సంతానాన్ని ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతాయి. 12 వారాల వయస్సున్న వాటిని అమ్మకానికి పెట్టవచ్చు. ఈ సమయంలో వాటి బరువు కనీసం 2 కిలోలు ఉండేలా చూసుకుంటే చక్కని రేటు వస్తుంది.
ఆహారం
కుందేళ్లకు సమయం ప్రకారం ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి శాఖాహారులు. పగటి పూట ఆహారం తీసుకోవు. సాయంకాలం, రాత్రిపూట చురుకుగా కదులుతాయి. అందుకే సాయంత్రం వేళ దాణా అందిస్తే పూర్తిగా తింటాయి. దాణాను పొడి రూపంలో గాని, గుళికల రూపంలోగాని ఇవ్వొచ్చు. మక్క పిండి, గోధుమ పొట్టు, పల్లిపిండిని సమపాళ్లలో కలపి అందులో మినరల్ మిక్చర్ కలిపి దాణాగా ఇవ్వవచ్చు. దాణాతో పాటు పచ్చిమేతను కూడా ఇవ్వాలి.
ఉదయం 7 గంటలకు షెడ్ క్లీన్ చేసుకుని తాగు నీరు, దాణా అందివ్వాలి. సాయంత్రం పచ్చి గడ్డిని వేయాలి. దీని వల్ల ఎదుగుదల బాగుంటుంది. దాణాలో ఎలాంటి రసాయనాలు కలవకుండా చూడాలి. పూర్తి సేంద్రీయ విధానంలో పండించిన ఆహారాన్ని కుందేళ్లకు అందించడం చాలా మంచిది.
వ్యాధులు
కుందేళ్లు పుట్టినప్పటి నుంచి వాటిలో ఎలాంటి రోగాలు కనిపించవు. షెడ్డులో సరైన శుభ్రత లేకపోయినా, ఆహారం అందించడంలో తేడాలు ఉంటే తప్పితే.. వీటి పెంపకంలో ఎలాంటి సమస్యలు ఉండవు. కుందేళ్లకు సహజంగా పాస్ట్యురెల్లోసిస్, పేగులకు సంబంధించిన రోగం, మెడవాల్చు రోగం, స్తనముల వాపు రోగం వంటివి వస్తుంటాయి. అందుకని వాటి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
నాణ్యమైన ఆహారాన్ని అందించడం ద్వారా ప్రోటీన్గా మలుచుకుని మాంసంను పెంచుకుంటుంది. రైతులకు అధిక లాభాలను తెచ్చిపెడుతుంది. షెడ్లో టెంపరేచర్ను ఎప్పుడూ కంట్రోల్ చేస్తూ ఉండాలి. నార్మల్ టెంపరేచర్ మెయింటేన్ చేసుకోవాలి. వానాకాలం, చలికాలంలో వెచ్చగా ఉండేందుకు పరదాలు ఏర్పాటుచేయాలి. ఏప్రిల్ మే నెలలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నందున క్రాసింగ్ చేయించకూడదు.