మల్లెపూలు స్వచ్ఛతకు, సువాసనకు మారుపేరు. ఈ పూలకు మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ మంచి ఆదరణ ఉన్నది. ఈ పూల సాగు చేసే రైతులకు సంవత్సరంలో చాలాకాలం ఆదాయం వస్తుంది. మన రాష్ట్రంలో మల్లె సాగును ఎక్కడైనా చేయవచ్చు. ఒకసారి నాటితే ఐదేండ్ల వరకు పూల దిగుబడిని ఇచ్చే మల్లె తోటలను అనువైన నేలల్లోనే సాగు చేయడం చాలా ఉత్తమం. అయితే ప్రస్తుతం ఈ తోటల్లో చేయాల్సిన పనుల గురించి ఉద్యాన అధికారులు అందించిన వివరాలు..
కొమ్మల కత్తిరింపు
మల్లెలో మంచి దిగుబడి కోసం ఏటా కొమ్మలను కత్తిరించాలి. ఆకులను దూసివేయాలి. దీనివల్ల కొత్త చిగుళ్లు వచ్చి వాటిపై మొగ్గలు వస్తాయి. అయితే సంప్రదాయంగా మల్లె తోటలను సాగుచేసే రైతులు గొర్రెల మంద కడుతారు. ఈ పద్ధతిలో గొర్రెలు ఆకులు తింటాయి. దీనివల్ల చిగుర్లు వస్తాయి. అట్లనే గొర్రెల ఎరువు వల్ల భూసారమూ పెరుగుతుంది.
అయితే ఎక్కువ కాలం పూల దిగుబడి కోసం గుండు మల్లెలో కొమ్మ కత్తిరింపులను 3-4 దఫాలుగా/తడవలుగా చేయాలి. నవంబర్ చివరి వారం నుంచి జనవరి మొదటి వరకు కత్తింపులు చేస్తే మార్చి నుంచి జూలై వరకు పూలు వస్తాయి. ఇలా చేయడం వల్ల మల్లె మొక్కలన్నీ ఒకేసారి పూతకు రావు. రైతులు ఎక్కువరోజులు మల్లెపూలను మార్కెటింగ్ చేసుకోవచ్చు. మంచి లాభం పొందవచ్చు.
కొమ్మలను 70-90 సెం.మీ. ఎత్తు వరకు కత్తిరించాలి. చీడపీడలు ఆశించిన కొమ్మలను తెంచివేయాలి. ఆకులను దూసివేయాలి. మల్లె కొమ్మలను దగ్గరగా కట్టి మొక్కల మధ్య దున్న 10 రోజుల తరువాత నిపుణుల సూచించిన సిఫార్సు మేరకు ఎరువులు వేయాలి. కొత్త చిగుర్లపై మొగ్గలు వచ్చే వరకు పలుచగా నీరు కట్టాలి.