ఉసిరి పంట రాష్ట్రంలోని అన్నిజిల్లాలో సాగు చేసుకునేందుకు అనుకూలం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉసిరిసాగు దాదాపు 5,670 ఎకరాలలో జరుగుతున్నదని అంచనా. గతంతో పోలిస్తే ప్రస్తుతం వినియోగం పెరుగుతున్నందున రైతులు ఉసిరి సాగుపై దృష్టి సారిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుందని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు.
నేలల రకాలు
నీరు నిల్వ ఉండని అన్నిరకాల నేలల్లో ఉసిరి సాగు చేసుకోవచ్చు. ఆమ్ల, క్షార లక్షణాలున్న భూముల్లో కూడ ఈ పంటను సాగుచేయవచ్చు. సోడి యం 30 శాతం వరకు వున్న భూముల్లోనూ ఉసిరిని పండించవచ్చు. ఉదజని సూచిక 9.5 వరకు ఉన్న భూములలో పండించవచ్చు. ఉసిరి రకాలు : ఉద్యాన అధికారుల సూచనలకు అను గుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి.
మొక్కలు నాటే విధానం
భూమిని మొత్తగా దున్ని చదును చేసుకోవాలి. 1X1,1X1 మీటర్ల లోతైన గుంత లు తవ్వుకోవాలి. వర్షాధారంగా సాగు చేస్తే ఎకరాకు 60 మొక్కలు చొప్పున 8X8 మీటర్ల దూరంలో, నీటి వసతి (డ్రిప్) క్రింద ఎకరాకు 110 మొక్కలు చొప్పున 6X6 మీటర్ల దూరంలో నాటుకోవాలి. వేరు మూలం మీద పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. వెదురు కట్టెతో ఊతం ఇవ్వాలి.
కొమ్మ కత్తిరింపులు
ఉసిరి కొమ్మలు ఎక్కువగా కాయలు కలిగి ఉండి పెలుసుగా ఉండటం ద్వారా తరచు విరిగి పోతుంటాయి. కాబట్టి తలకొన భాగాన్ని మాత్రమే కత్తిరించుకోవాలి. అక్కడ నుంచి సుమారు 4-6 పక్క కొమ్మలు చెట్టు మెదలకు నాలుగువైపులా సమదూరం లో పెరిగేలా చూడాలి. ఎక్కువగా ఉండే కొమ్మలను కోసిన తరువాత ఎక్కువ ఎత్తు పెరుగకుండా కత్తిరించుకోవాలి.
నీటి యాజమాన్యం
ఉసిరి చెట్టు నీటి ఎద్దడి చాలావరకు తట్టుకుంటుంది. అయినప్పటికీ నీటి యాజమాన్యాన్ని పాటిస్తే మొక్కలలో ఎదుగుదల బాగుండి దిగుబడులు సైతం అదేస్థాయిలో పొందవచ్చు. మొదటి మూడు సంవత్సరాల వరకు అవసరాన్నిబట్టి పాటించి సరైన మోతాదులో నీరు అందిస్తే మొక్కలు బాగా పెరుగుతా యి. ఎండాకాలంలో మాత్రం 4-5 రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిని పాటిస్తే 30-40 శాతం నీటిని ఆదా చేసుకోవచ్చు.
ఎరువుల యాజమాన్యం
ఉసిరి మొక్క వయసును బట్టి ఉద్యానశాఖ అధికారుల సూచనలకు అనుగుణంగా ఎరువులు వేసుకోవాలి. మొదటి సంవత్సరం చెట్టుకు 100 గ్రాముల నత్రజని, 50 గ్రాముల భాస్వరం, 100 గ్రాముల పొటాషియం ఎరువులతో పాటు 10 కిలోల పశువుల ఎరువులు వేసుకోవాలి. చెట్లలో బోరాన్ లోప నివారణకు లీటర్ నీటికి 60 గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చేయాలి.
అంతర పంటలు
ఉసిరి చెట్లకు ఎనిమిదేండ్ల వయస్సు వచ్చే వరకు వివిధ రకాల అంతర పంటలను సాగు చేసుకోవచ్చు. తద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా పల్లి, పెసర, అలసంద లాంటి పంటలతో పాటు సుగంధ తైలాన్నిచ్చే నిమ్మగడ్డి వంటి తదితర ఔషధ మొక్కలనూ సాగు చేసుకోవచ్చు.
కాయ పక్వదశ, పంటకోత
కాయలను పరిపక్వ దశకు వచ్చిన తరువాత మాత్రమే కోయాలి. బాగా తయారైన కాయలు రకాన్ని బట్టి సరాసరి 25-40 గ్రాముల వరకు బరువుంటాయి. కాయ రంగు లేత ఆకుపచ్చ రంగు నుంచి ఆకుపచ్చ రంగుకుగాను లేత పసుపచ్చ రంగుకుగాను మారినప్పుడు కాయల్లో గింజ రంగు వెన్నెలాంటి తెల్లటి రంగు నుంచి మట్టి రంగుకు మారినప్పుడు కాయ పక్వదశకు వచ్చినట్లు నిర్ధారించుకోవచ్చు.
గ్రేడింగ్, నిల్వ పద్ధతి
ఉసిరి కాయలను కోసిన తరువాత కాయ పరిణామం, బరువు, రంగు, పక్వ దశను బట్టి మూడు గ్రేడులుగా విభజించవచ్చు. అంతకంటే ముందు దెబ్బతిన్న కాయలను, వంకరటింకరగా ఉన్న కాయలను వేరుచేయాలి. పెద్ద సైజు (4 సెం.మీ. వ్యాసార్థం) కాయలను మురబ్బా తయారుచేయడానికి వాడవచ్చు. మధ్యస్థం (3-4 సెం.మీ.వ్యాసార్థం) గల కాయలను పచ్చడి, రసం, క్యాండి, ఎండు పలుకులు మొదలగు పదార్థాలు తయారీకి వాడాలి. చిన్నకాయలను (3 సెం.మీ కంటే తక్కువ) ఔషధ తయారీకి ఉపయోగించుకోవచ్చు. ఉసిరికాయలను గది వాతావరణాన్ని బట్టి ఆరు నుంచి తొమ్మిదిరోజుల వరకు నిల్వ ఉంచవచ్చు. శీతల గిడ్డంగులలో 5-7 డిగ్రీల సెలియస్ వద్ద దాదాపు రెండు నెలల వరకు నిల్వ ఉంచవచ్చు.