Agriculture | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): అడవి పందులు, కోతుల బారి నుంచి పంట పొలాలకు రక్షణ కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీలో భాగమైన అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం ప్రత్యేకంగా ‘జీవ ఆర్తనాద’ యంత్రాన్ని తయారుచేసింది. ఈ యంత్రం సహాయంతో 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలోని పంటలను అడవి పందులు, కోతుల బారి నుంచి రక్షించుకోవచ్చు. ఈ యంత్రం నుంచి వెలువడే శబ్దాలు, వివిధ రకాల జంతువుల అరుపులకు అడవి పందులు, కోతులు పారిపోతాయి. దీనిని వర్సిటీ అధికారులు ప్రయోగాత్మకంగా పరీక్షించగా 80-90 శాతం పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చునని తేలింది.
జీవ ఆర్తనాద యంత్రంలో స్పీకర్, మదర్ బోర్డు, బ్యాటరీతో కూడిన ఒక బాక్స్ ఉంటుంది. మదర్బోర్డులో పలు రకాల జంతువుల అరుపులను రికార్డు చేసి పెడతారు. ముఖ్యంగా అడవి పందులను భయపెట్టే పులులు, అడవి కుక్కలు, చిరుత పులులు ధ్వనులను నిక్షిప్తం చేస్తారు. ఇది పూర్తిగా సోలార్ ప్యానెల్, బ్యాటరీతో పనిచేస్తుంది. రైతులు ఈ పరికరాన్ని ఒక స్టాండ్ సాయంతో పంటకు అడుగు దూరంలో కాస్త ఎత్తులో అమర్చుతారు. రాత్రి సమయంలో ఈ బాక్స్ ను ఆన్ చేయడం వల్ల అందులో నుంచి వచ్చే జంతువుల అరుపులకు అడవి పందులు భయపడి పంట పొలాల వైపు రాకుండా వెళ్లిపోతాయి. బ్యాటరీ ఒక్కసారి ఫుల్ అయితే రోజుకు 18-20 గంటలు పనిచేస్తుంది. బ్యాటరీ ఐదేండ్లపాటు పనిచేస్తుంది. ఈ పరికరాన్ని అమర్చిన ప్రదేశం నుంచి 5-10 ఎకరాల పరిధి వరకు ప్రభావం ఉంటుంది. ఈ ఆర్తనాద యంత్రాన్ని రైతులు తమ స్మార్ట్ఫోన్తో అనుసంధానం చేసి ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ యంత్రాలు వ్యవసాయ యూనివర్సిటీలోని అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగంలో లభిస్తాయి. దీని ధర రూ.26 వేలు. అవసరమైన రైతులు 9490806018 నంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.