ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 16: ‘ఒక ఎకరం వరిపంట సాగు చేయటానికి రూ.50 వేలు అవుతుంది. ఆ ఖర్చుతో నాలుగెకరాల్లో కూరగాయల పంటలు వేసుకోవచ్చు’ అని మహిళా రైతు టేకుల బాలమణి, ఆమె కుమారుడు మహేందర్రెడ్డి చెప్తున్నారు. వీరిది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ. ఎనిమిది ఎకరాల పొలంలో వీళ్లు గతంలో వరి సాగు చేసేవారు. చీడపీడలు, నీటి సమస్యలు, అకాల వర్షాలు దెబ్బతీశాయి. వ్యవసాయాధికారుల సూచనలతో కూరగాయల సాగుపై దృష్టిపెట్టారు. తండ్రి కూడా సహాయం అందించటంతో మహేందర్రెడ్డి.. రెండెకరాల్లో కూరగాయలు, రెండెకరాల్లో ఆకుకూరలు, మరో రెండెకరాల్లో వేరుశనగ, కంది, మక్కజొన్న, పత్తిలాంటి పంటలను సాగు చేశాడు. ఇంటి అవసరాల కోసం రెండెకరాల్లో వరిని వేశామని, కూరగాయల పంటలతో పెట్టుబడులు తగ్గి, దిగుబడి పెరిగిందని మహేందర్రెడ్డి తెలిపారు. కూరగాయల సాగుతో ప్రతి రోజు ఆదాయం వస్తున్నదని, ఇంటిల్లిపాదికి ఏడాదంతా పని దొరుకుతున్నదని వెల్లడించారు. కూరగాయల పంటలకు తెగుళ్లు కూడా ఎక్కువగా ఉండవని వివరించారు. బెండ, వంకాయ, టమాటలు రెండు రోజులకోసారి చేతికందుతున్నాయని, బెండ కిలో రూ.60, టమాట రూ.60, వంకాయ రూ.50కి అమ్ముడుపోతున్నాయని తెలిపారు. ఇక ముందు కూడా వరికి బదులు కూరగాయ పంటలే సాగుచేయాలని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
మా పొలంలో పండించిన ఆకుకూరలను రోజు పొద్దుగాలనే కట్టలు కడుతా. నా కొడుకు వాటన్నింటినీ హైదరాబాద్కు తీసుకపోతడు. మెంతికూర, తోటకూర, కొత్తిమీర ఆకుకూరలను సాగు చేసినం. ఆకుకూరలు సాగుచేయటం ద్వారా రోజు రూ.రెండు వేల ఆదాయం వస్తున్నది.
బాలమణి, మహిళా రైతు
(మహేందర్ రెడ్డి ఫోన్ నంబర్: 9949661675)