తన భూమి ఆహారానికి అమృతతుల్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఏడేండ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఎదుళ్ల అంజిరెడ్డి. తండ్రి స్ఫూర్తితో, సుభాష్ పాలేకర్ సలహాలతో విషరహిత పంటలు పండిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. నల్లగొండ పట్టణ శివారులోని అన్నెపర్తి పంచాయతీ పరిధిలోని తన వ్యవసాయ క్షేత్రంలో అద్భుతమైన పంటలు పండిస్తున్నాడు. 20 ఎకరాల్లో 200 రకాల పంటలు సాగుచేస్తూ.. ‘ఔరా!’ అనిపిస్తున్నాడు. కొత్తిమీర నుంచి ముల్లంగి వరకు.. అరటి నుంచి అల్లనేరేడు దాకా.. నీడనిచ్చే వేప, ఔషధ మొక్కల నుంచి అధిక ఆదాయాన్నిచ్చే శ్రీగంధం, ఎర్ర చందనం దాకా ఇక్కడ దర్శనమిస్తుంటాయి.
రకరకాల కూరగాయలు, పండ్లు..
సాధారణ మార్కెట్తోపాటు సూపర్ మార్కెట్లో దొరికే అన్ని రకాల కూరగాయలు అంజిరెడ్డి పొలంలో పండుతున్నాయి. టమాట, దొండకాయ, బెండకాయ లాంటివాటితోపాటు ముల్లంగి, బీన్స్, క్యాప్సికం. పుట్టగొడుగు లాంటి కూరగాయలు ఇక్కడ విరగ కాస్తుంటాయి. పండ్ల విషయానికి వస్తే.. సాధారణ రకాలతోపాటు ఆయా పండ్లలో ఉండే వెరైటీ రకాలు పండిస్తున్నాడు. అరటిలో చక్కెర కేళి, కర్పూరం, జీ9 అరటి.. మామిడిలో పది రకాల వెరైటీలు ఇక్కడ సాగవుతున్నాయి.
అడుగుకో రకం..
తన వ్యవసాయ క్షేత్రంలోని ఐదెకరాల్లో వరి సాగుచేస్తున్నాడు. అందులో చిట్టి ముత్యాలు, షుగర్ లెస్, రెడ్ రైస్, సిద్ధ, గోదావరి సన్నాలు పండిస్తున్నాడు. మిగిలిన 15 ఎకరాల్లో ప్రతి ప్రాంతం ఒక ఫుడ్ బౌండరీగా ఏర్పాటుచేశాడు. అంటే ఏం కావాలన్నా తోట మొత్తం తిరగాల్సిన పని లేకుండా.. ఈ క్షేత్రంలోని అడుగడుగునా కూరగాయలు, పండ్లు, ఇతర వెరైటీలు కనిపిస్తూనే ఉంటాయి. చేను చుట్టూ శ్రీగంధం, ఎర్ర చందనం, వెదురు, టేకు లాంటి చెట్లు పెంచుతున్నాడు. ఇదే క్షేత్రంలో తేనెటీగల పెంపకం చేపట్టాడు. కోళ్లు, బాతులను పెంచడంతోపాటు ఆక్వాకల్చర్లో భాగంగా చేపల పెంపకం కూడా చేపడుతున్నాడు.
సేంద్రియ పద్ధతుల్లోనే..
రసాయన ఎరువులతో భూములు పూర్తిగా విషతుల్యం అవుతున్నాయని అంజిరెడ్డి అభిప్రాయం. ఈ నేపథ్యంలో తన తండ్రి రాంరెడ్డి స్ఫూర్తితో సేంద్రియ వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్, లావణ్యారెడ్డి సలహాలతో ప్రకృతి వ్యవసాయం చేపట్టాడు. సేంద్రియ సాగు చేస్తూ, భూమిని కాపాడాలనీ, కొంత మందిలోనైనా మార్పు తీసుకురావాలనీ ఆశిస్తున్నాడు. తన పొలంలో ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా పంటలు పండిస్తున్నాడు. దేశీ ఆవులు పెంచుతూ.. గో కృపామృతం, జీవామృతం తయారు చేస్తున్నాడు. వేప కషాయం ద్వారా చీడపీడలను నివారిస్తున్నాడు.
పలువురికి సహాయం..
అన్నెపర్తికి చెందిన ఎదుళ్ల అంజిరెడ్డి ఎక్సైజ్ శాఖలో సూపరింటెండెంట్గా ఏడేండ్ల కింద ఉద్యోగ విరమణ పొందాడు. అప్పటినుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. నల్లగొండ లయన్స్ క్లబ్లో అంజిరెడ్డి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. క్లబ్ ఆధ్వర్యంలో ఏటా పేద విద్యార్థ్దులకు స్టడీ మెటీరియల్స్, డిక్షనరీలు అందచేస్తున్నాడు.
– నకిరేకంటి శ్రీనివాస్
విషరహిత ఆహారం కోసమే..
వ్యవసాయంలో రసాయన ఎరువులను విరివిగా వాడుతున్నారు. దీంతో భూములు పూర్తిగా విషతుల్యమై, భావిభారతానికి ఆహారమే దొరకని పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఇది మారాల్సిన అవసరం ఉన్నది. కాస్త ఓపిక ఉంటే చాలు.. దీనివల్ల చాలా మేలు చేకూరుతుంది. నాలుగైదేండ్లలో మన భూమి సారవంతంగా తయారవుతుంది. అందరికీ విషరహితమైన ఆహారం అందుతుంది. ఆ లక్ష్యంతోనే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా.
– ఎదుళ్ల అంజిరెడ్డి, నల్లగొండ